అక్టోబర్ 1 ప్రపంచ వృద్ధుల దినోత్సవం.. వృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత!


ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయో వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. సీనియర్‌ సిటిజన్‌ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడడం జరిగింది.మొదటిసారిగా 1991, అక్టోబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా పంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు.1990, డిసెంబర్‌ 14న ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ఒక నిర్థిష్ట ప్రణాళికను తయారుచేసి, ప్రపంచ దేశాలన్నీ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది.పర్యవసానంగా 1999 సంవత్సరంలో మన దేశంలో వృద్ధుల సంక్షేమానికి ఒక జాతీయ ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఆర్థిక భద్రత, ఆరోగ్య రక్షణ, నివాస వసతి, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించారు. అయితే అది ఎటువంటి కార్యాచరణకు నోచుకోలేదు. 2004లో స్పెయిన్ దేశంలో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించారు.మన దేశంలో 60 ఏళ్ళకు మించిన వృద్ధులు దాదాపు 11 కోట్ల మంది ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. మరో 20 ఏళ్ళలో ఈ సంఖ్య రెట్టింపు కాగలదని అంచనా. అనగా మనిషి జీవన పరిమాణం పెరుగుతుంది. ఇది మంచి పరిణామమే. ఫలితంగా మన కేంద్ర ప్రభుత్వం 2007లో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రాలన్నీ ఆ నియమనిబంధలను రూపొందించుకొని ఆ చట్టాన్ని అమలు చేయమని కోరడమైనది. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు కోటి మందికిపైగా 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధులు ఉన్నట్లు అంచనా. ఇందులో 25 శాతం మంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్లలో ఉద్యోగాలు చేసి రిటైరయి, పెద్ద మొత్తంలో పి.ఎఫ్‌. ఇ.పి.ఎఫ్‌. డబ్బు పొంది నెలనెలా పెన్షన్లు పొందుతూ సొంత ఇండ్లలో హాయిగా బతుకుతున్నారు. మరో 15 శాతం మంది సొంత మంది సొంత ఇండ్లతో, నెలనెలా అద్దెలతో వ్యవసాయ భూముల వలన పంటల ఆదాయంతో ఉన్నారు వీరి గురించి కూడా ఏ బాధా లేదు. ఇంకో 15 శాతం మంది 60 సంవత్సరాలు పైబడినా కూడా వివిధ రకాల వ్యాపారాలు, వర్తకాలు చేస్తూ డబ్బు సంపాదించుకొంటున్నారు. మరో 10 శాతం మంది కుమారుల సంరక్షణలలో ఉన్నారు. వారికి కూడా ఏ దిగులూ లేదు. మిగిలిన 35 శాతం మంది గురించే మనం ఆలోచించాలి. ఇందులో 25 లక్షల మంది గ్రామాల్లో జీవిస్తున్నవారే. ఈ 25 లక్షల మంది ఆర్థిక, సామాజిక, అనారోగ్య బాధలు పడుతున్నారు.. దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తులవారు 60 సంవత్సరాల తర్వాత శరీర సత్తువ తగ్గి సంపాదించుకోలేక పోతున్నారు. వీళ్లకు మరే విధమైన ఆర్థిక వనరులు లేకపోవడం వలన ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతో కష్టపడి కాయకష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని పైసా పైసా కూడబెట్టి తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదని ముందుచూపుతో పిల్లలకు చదువు చె ప్పించి ప్రయోజకుల్ని చేస్తే వాళ్ల చేతనే ఈ వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలలో, ఇతర దేశాలలో స్థిరపడి తమ తమ తల్లిదండ్రులను ఆదుకోనివారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోవడం, భార్యాపిల్లలను పోషించుకోవడంలో ఉన్న శ్రద్ధ తల్లిదండ్రులపై ఉండటం లేదు. సాధారణంగా 60 ఏళ్ళ పైబడిన వాళ్లకు రోగాలు మొదలవుతుంటాయి. దీర్ఘకాల రోగాల బారినపడి ఖరీదైన వైద్యం చేయించలేక ఎంతోమంది శేష జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. ఇక మా బతుకులింతే అని నిరాశా నిస్పృహలతో భారంగా గడుపుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ప్రతి మండల కేంద్రంలో ఈ వృద్ధులకు ఉచిత వైద్య సహకారం అందించాలి. ఆర్టీసీ బస్సులలో రాయితీ, రైల్వేలలో ఇస్తున్న 40 శాతం కాకుండా ఇంకో 20 శాతం పెంచాలి. అంతేకాకుండా రిజర్వేషన్‌లో కూడా ప్రాముఖ్యం కల్పించాలి. ప్రతి బ్యాంకులో క్యూ తో నిమిత్తం లేకుండా సీనియర్‌ సిటిజన్లకు లావాదేవీలు జరిపే సదుపాయం కల్పించాలి. కార్పొరేట్‌ ఆస్పత్రులలో 25 శాతం రాయితీ కల్పించి ఆ విషయాన్ని ఆసుపత్రి బోర్డులపై ప్రచురించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఒక మంత్రిని నియమించాలి. సీనియర్‌ సిటిజన్లు ఎదర్కొంటున్న సామాజిక బాధలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలి. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు ఉచిత వైద్య సహాయం అందచేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, పోలీస్‌ స్టేషన్‌లో వృద్ధులను గౌరవించడం మన బాధ్యత అనే బోర్డులను ఏర్పాటు చేయాలి.  తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట మొదలగు రద్దీ ఉండే పుణ్య క్షేత్రాలలో వృద్ధులకు క్యూ నిమిత్తం లేకుండా డైరెక్టుగా దర్శన ఏర్పాట్లు కల్పించాలి. అందుకే సీనియర్‌ సిటిజన్లందరూ సంఘాలలో సభ్యులై ‘మన కోసం మనమే’ అనే సిద్ధాంతంతో శేష జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. మన ప్రభుత్వాలు ఫలానా పక్షులు, ఫలానా జంతువులు అంతరించి పోవుచున్నాయని వాటిని పరిరక్షించడానికి కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నారు. భూమిపై పుట్టిన ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. కాదనను, కానీ వృద్ధులు కూడా అవస్థలు పడకుండా అలమటించి పోకుండా చూసే బాధ్యత యువతకు, ప్రభుత్వానికి వుంది. అందుకే వృద్ధులను ఆదుకోండి. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పక వృద్ధులవుతారు కాబట్టి.


కామెంట్‌లు